|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:55 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పోర్టుల్ని అభివృద్ధి చేస్తోంది.. కొత్త పోర్టుల్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం సహకారంతో నిధులు తీసుకొచ్చి వీటిని ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం పనులు వేగవంతం చేశారు.. అక్కడే ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా టౌన్షిప్లు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టౌన్షిప్ల కోసం అధికారులు భూముల్ని గుర్తిస్తున్నట్లు సమాచారం. టెక్కలి దగ్గర నేషనల్ హైవే నుంచి మూలపేట పోర్టు వరకు ఉన్న లింక్ రోడ్డుకు ఇరువైపులా ఈ టౌన్షిప్లు ప్లాన్ చేస్తున్నారట. భూసేకరణ దిశగా అడుగులు పడుతున్నాయట.
మూలపేట పోర్టుకు కనెక్ట్ చేసే రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే 100 వెడల్పుతో భూసేకరణ పూర్తి చేసి.. ఈ రోడ్డు పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ పరిశ్రమల కోసం టౌన్షిప్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ మూలపేట పోర్టు రోడ్డుకు రెండు వైపులా స్థలాలు సేకరించనున్నారు. ఆ రోడ్డుకు దగ్గర 50 మీటర్లు గ్రీనరీ ప్లాన్ చేశారు.. ఆ తర్వాత కిలోమీటరు వరకు భూముల్ని టౌన్షిప్ల కోసం కేటాయించనున్నారు. ఈ టౌన్షిప్ల కోసం ఏకంగా 3వేల ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
మూలపోర్టు సమీపంలో నౌపడాలో ప్రస్తుత ఆర్అండ్ఆర్ కాలనీ దగ్గర మరో టౌన్షిప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ మర్రిపాడు రెవెన్యూ పరిధిలో ఉయ్యాలపేట రోడ్డులో జిరాయితీ ఉప్పు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించాట. మొత్తం 485 ఎకరాల భూములు ఉన్నాయట.. వీటిని భూసమీకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తున్నారట. అప్పుడు టౌన్షిప్కు ఇబ్బందులు ఉండవు అంటున్నారు.. ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అంటున్నారు. అందుకే ఈ భూముల విషయంలో రైతుల్ని ఒప్పించాలని నిర్ణయించారట. జేసీ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవోలు కలిసి ఆ భూముల్ని రెండు రోజుల క్రితం పరిశీలించారు.
Latest News