|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:50 PM
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే పాదయాత్రగా శ్రీశైలం వచ్చే భక్తులకు అటవీశాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అటవీ మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు. కానీ ఇటీవల శ్రీశైలంలో బ్రహ్మో్త్సవాల ఏర్పాట్లపై సమీక్ష చేసిన మంత్రులు.. భక్తుల ఇబ్బందుల్ని గమనించి ఈ నెల 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో భక్తుల్ని అనుమతించాలని నిర్ణయించారు. ఈ క్రమంంలో శుక్రవారం (ఫిబ్రవరి 6) నుంచి భక్తులు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి అటవీ మార్గంలో బయలుదేరారు.. ఈ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
వాస్తవానికి నాగార్జునసాగర్ టు శ్రీశైలం నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల్ని లెక్కిస్తున్నారు. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్స్- 2026లో భాగంగా పులుల్ని మూడు దశల్లో లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి మే 31 వరకు లెక్కింపు కొనసాగనుంది. ప్రస్తుతం తొలిదశ లెక్కింపులో భాగంగా ఈ నెల 10 వరకు పులుల్ని లెక్కింపు కొనసాగనుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు.. నంద్యాల, ఆత్మకూరు పారెస్ట్ డివిజన్లో లెక్కిస్తున్నారు. ట్రాప్ కెమెరాల సాయంతో పులుల లెక్కలు వేస్తున్నారు. ఈ కారణంగానే అటవీ మార్గంలో శ్రీశైలం నడిచి వెళ్లే భక్తుల్ని అనుమతించలేదు.. ఆంక్షలు విధించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఈ నెల 8 నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసే 15 వరకు మాత్రమే అటవీమార్గంలో అనుమతించారు.
అయితే శ్రీశైలానికి వచ్చే భక్తులు, శివ దీక్ష తీసుకున్న భక్తులు ముందుగానే పాదయాత్రగా బయల్దేరారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. భక్తులు అటవీ మార్గంలో వెళ్లకుండా.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి కర్నూలు- గుంటూరు నేషనల్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లాలని చెప్పారు. అయితే అంత దూరం ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న శ్రీశైలంలో జరిగిన సమీక్షకు హాజరైన మంత్రులు అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రెండు రోజులు ముందుగానే.. అంటే ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. మొత్తం మీద శ్రీశైలం అటవీమార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. ఇటు బ్రహ్మోత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలానికి అటవీమార్గంలో కాలినడకన వెళ్లే భక్తులు అటవీశాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ప్రతి భక్తుడి బ్యాగుల్ని తనిఖీ చేస్తారు.. సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టె, గుట్కాలను అనుమతించరు. అటవీ మార్గంలో వెళ్లే భక్తులు వన్యప్రాణులకు ఎలాంటి హాని చేయకూడదు. అలాగే ప్లాస్టిక్ను తీసుకెళ్లడం, అడవికి నిప్పు పెట్టే అగ్నిపెట్టెలు, మద్యానికి అనుమతి లేదు. రాత్రి వేళలో నడిచి వెళ్లే సమయంలో శబ్దం చేయకూడదు.
Latest News