ఇక ఛార్జీలు కట్టాల్సిందే,,,,కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:03 PM

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్  రూల్స్‌లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉచితంగా పొందుతున్న సేవలకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా జరిపే కొన్ని ట్రాన్సాక్షన్ల పై ఉన్న ఉచిత సర్వీసుల వెసులుబాటును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటి స్థానంలో కొత్త సేవా ఛార్జీలను ఖరారు చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది. సవరించిన కొత్త ఐఎంపీఎస్ ఛార్జీలు ఫిబ్రవరి 15, 2026 నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


సాధారణంగా తక్షణమే డబ్బులు పంపించేందుకు ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ (ఐఎంపీఎస్) విధానాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లిమిట్ దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు ఈ ఐఎంపీఎస్ సేవలను ఉపయోగిస్తుంటారు. అయితే, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో ఆన్‌లైన్ ఛానెళ్లను ఉపయోగించి (ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్) నిర్వహించే భారీ లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఫిబ్రవరి 15, 2026 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని, ఆన్‌లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు పంపించే నగదును బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపింది.


రూ. 25,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు (ఉచితం)


రూ. 25,001 నుంచి రూ. 1 లక్ష వరకు పంపిస్తే రూ. 2 + జీఎస్‌టీ (GST) అదనం


రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బదిలీ చేస్తే రూ. 6 + జీఎస్‌టీ


రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పంపిస్తే రూ. 10 + జీఎస్‌టీ


అయితే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఐఎంపీఎస్ లావాదేవీలు నిర్వహిస్తే విధించే ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు చేస్తే పాత ఛార్జీలే వర్తిస్తాయి. అందులో ప్రస్తుతానికి ఏ మార్పు చేయలేదు. ప్రస్తుతం బ్రాంచ్ లావాదేవీలకు రూ. 2 నుంచి రూ. 20 వరకు ( పంపించే నగదు బట్టి) ఛార్జీలు విధిస్తున్నారు. అలాగే కొన్ని రకాల అకౌంట్లకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించారు. శాలరీ ప్యాకేజీ ఖాతాలు డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వ, రైల్వే, పోలీస్ శాఖల వంటి శాలరీ ఖాతాలు ఉన్న వారికి ఈ కొత్త ఛార్జీలు వర్తించవని బ్యాంక్ తెలిపింది.


అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతా, ఎస్బీఐ రిష్టే వంటి స్పెషల్ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ఐఎం‌పీఎస్ సర్వీలు యథాతథంగా ఉచితంగానే అందుతాయని ఎస్‌బీఐ తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే అధిక విలువ ఉండే ట్రాన్సాక్షన్లపై నామమాత్రపు రుసుములు వసూలు చేయడం ద్వారా బ్యాంక్ తన ఆదాయ వనరులు పెంచుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రూ. 25,000లోపు చేసే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లు పూర్తి ఉచితంగానే ఉంటాయి. దీంతో సామాన్యులకు ఊరట లభిస్తుంది. ఎస్బీఐ వినియోగదారులు ఫిబ్రవరి 15లోపే పెద్ద మొత్తంలో నిర్వహించే ఐఎంపీఎస్ లావాదేవీలు పూర్తి చేయడం మంచిది.

Latest News
Ranji Trophy Final: Yawer, Pundir's fifties take J&K to 178/2 at tea against Karnataka on Day 1 Tue, Feb 24, 2026, 04:14 PM
Cartel boss killing sparks chaos in Mexico Tue, Feb 24, 2026, 03:55 PM
Bomb threat email triggers panic at Bengal court, hoax suspected Tue, Feb 24, 2026, 03:46 PM
Three members of a family die by suicide in Hyderabad Tue, Feb 24, 2026, 03:42 PM
Five Baloch civilians forcibly disappeared at the hands of Pakistani forces Tue, Feb 24, 2026, 02:29 PM