|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:58 PM
ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే యువతకు కలల ప్రపంచం. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని, ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాలని కలలు కనేవారు. అందుకోసం ఎంతో కష్టపడే వారు. అయితే, ప్రస్తుతం పరిస్థితిలు మారిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు పోతాయనే భయాలు ఎక్కువయ్యాయి. ఏఐతో ఐటీ, టెక్ రంగంలో ప్రధానంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు పోతాయని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సైతం సాఫ్ట్వేర్ డెవలపర్లను హెచ్చరించారు. వారు ఇక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.
కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కోడ్ రాసి జీవనోపాధి పొందుతున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిందేనని శ్రీధర్ వెంబు సూచించారు. అనిష్ ముంకా అనే ఓ పెట్టుబడిదారు ఒక్క లైన్ కూడా కోడింగ్ రాయడం రాకుండానే ఏఐ సాయంతో భగవద్గీత యాప్ తయారు చేశారని, అందుకోసం ఏఐని ఎలా వాడింది అనే వివరాలను సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో చెప్పుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ శ్రీధర్ వెంబు సైతం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
'ప్రస్తుతం కోడ్ రాసే ఉద్యోగం చేస్తున్న వారందరూ నాతో సహా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి ఆలోచించడం మంచిది. భయంతో చెప్తున్నది కాదు, వాస్తవాన్ని అంగీకరించి చెప్తున్న నిజం ఇది. ఒక పెట్టుబడిదారు ఎలాంటి కోడింగ్ తెలియకుండానే ఏఐ సాయంతో భగవద్గీత యాప్ తయారు చేశాడు. ఆంథ్రోపిక్ కంపెనీ క్లాడ్ ఏఐతో ఒక పూర్తి సీ కంపైలర్ సృష్టించింది. ఇది చాలా క్లిష్టమైన ఇంజినీరింగ్ ప్రక్రియ. ఇలాంటి ఉదాహరణలు చాలవా కోడింగ్లో ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పేందుకు' అని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ మేర మారనుంది అనే విషయంపై జెమినై ప్రోతో మాట్లాడాని సంభాషణను సైతం శ్రీధర్ వెంబు ఎక్స్ లో పోస్టే చేశారు.ఏఐ కారణంగా భవిష్యత్తులో పోస్ట్ లేబర్ ఎకానమీ రావచ్చని అభిప్రాయపడ్డారు. పోస్ట్ లేబర్ ఎకానమీ అంటే మానవ శ్రమ అవసరం లేని ఆర్థిక వ్యవస్థ అని అర్థం. అందులో మనుషులు జీవితం, తమ కుటుంబం, ప్రకృతి, కళలు, సంస్కృతి, సంగీతం, ఆటలు, పండగలు, విశ్వాసం వంటి అంశాలపై దృష్టి సారించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఏఐ అనేది ఎవరి వద్ద ఉంటుందనే అంశంపై అది ఆధారపడి ఉంటుందన్నారు.
Latest News