|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:47 PM
భయం లేదు.. బెరుకు లేదు.. అదురు లేదు.. బెదురు లేదు.. అండర్ -19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాళ్ల ఆటను వర్ణించడానికి మాటలు చాలవు. టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన యువ భారత్.. తుదిపోరులో ఇంగ్లండ్ను ఇరగదీసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్తో.. ఛేజింగ్ మొదలెట్టకముందే ఇంగ్లండ్ సగం ఓడిపోయింది. దీంతో 100 పరుగుల తేడాతో విజయం సాధించి.. అండర్ -19 ప్రపంచకప్ను టీమిండియా ఆరోసారి కైవసం చేసుకుంది.
అండర్ -19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన వైభవ్ సూర్యవంశీ.. సిక్సర్లు, ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుపడ్డాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ టాప్ గేర్లోకి దూసుకెళ్లింది. 25 బాల్స్లోనే మరో 75 పరుగులు రాబట్టాడు.
ఈ క్రమంలోనే మరో భారీ షాట్కు ప్రయత్నించిన సూర్యవంశీ.. క్యాచ్ అవుట్ అయ్యాడు. 80 బాల్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. దీంతో భారతజట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేయగా.. అభిజ్ఞాన్ కుందు 40 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో 3 మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ముందు తేలిపోయింది. 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. ఫాల్కనర్ 115 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. బెన్ డాకిన్స్ 66 పరుగులు, బెన్ మేయెస్ 45 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అంబరీష్ మూడు వికెట్లు, దీపేశ్ రెండు వికెట్లు పడగొట్టారు.
మరోవైపు వైభవ్ సూర్యవంశీని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు వరించాయి. మరోవైపు అండర్ 19 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న తొలి క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.