|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:43 PM
విజయవాడవాసులకు కేంద్రం మరో తీపికబురు చెప్పింది. వచ్చే నెలలో మరో బైపాస్ అందుబాటులోకి రానుంది. కేంద్రం సహకారంతో చినఆవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్లు.. ఆరు వరుసలుగా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ బైపాస్ చెన్నై-కోల్కతా నేషనల్ హైవే 16లో విజయవాడ-గుండుగొలను సెక్షన్లో చినఆవుటపల్లి-గొల్లపూడి మధ్య ఉంటుంది. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం మార్చి 31కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు ఊరటల లభిస్తుంది.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. '2021 ఫిబ్రవరి 18న రూ.1,148.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఇప్పటి వరకు 29.57 కిలోమీటర్లు పూర్తి చేశారు.. మరో 0.43 కి.మీ. పనులు జరుగుతున్నాయి. ఈ పనులు కూడా మార్చి 31 కల్లా పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నాము' అని నితిన్ గడ్కరీ లోక్సభలో తెలిపారు. ఏపీలో రోడ్డు ప్రమాదాలపై కూడా నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-2024 మధ్య 1,629 బస్సు ప్రమాదాలు జరిగాయన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. గత ఆరేళ్లలో రాష్ట్రంలో 3,443 కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 34 టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారట.
ఇటు మరో బైపాస్ రోడ్డుపై గత నెలలో కేంద్రమంత్రి గడ్కరీ క్లారటీ ఇచ్చారు. విజయవాడ గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 2019లో రూ.1,194.59 కోట్ల అంచనా వ్యయంతో ఈ బైపాస్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.. ఈ బైపాస్లో కృష్ణా నదిపై అవసరమైన చోట బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 17.6 కిలో మీటర్ల బైపాస్లో 13.410 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి 31 లోపు మిగిలిన 4.226 కిలోమీటర్ల పనులు టార్గెట్ పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ బైపాస్ రోడ్లు అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. మొత్తం మీద విజయవాడకు చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్ల పనులు ముగింపు దశకు వచ్చాయి. సంక్రాంతి సమయంలో విజయవాడ పశ్చిమ బైపాస్పై ఒకవైపు వాహనాలను అనుమతించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి రెెండో వైపు కూడా వాహనాలను అనుమతించనున్నారు.
Latest News