|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:53 PM
పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత లక్కీ ఒబెరాయ్ను పట్టపగలే దుండుగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపుతోంది. జలంధర్లోని గురుద్వారా బయట శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వచ్చిన దుండగులు.. లక్కీ ఒబెరాయ్పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒబెరాయ్ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. జలంధర్ మోడల్ టౌన్లోని గురుద్వారా వెలుపల ఆప్ నేత తన కారును పార్క్ చేస్తుండగా.. దుండుగులు ద్విచక్రవాహనంపై వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించారు. కారులోపలి ఉన్న ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తాజాగా, లక్కీ ఒబెరాయ్పై కాల్పుల జరుపుతున్నప్పుడు రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. కాల్పుల జరపడానికి ముందు దుండుగుడు మెల్లగా వాహనాల దగ్గరకు వస్తున్నాడు. నలుపు రంగు హుడీ, ముఖం కనిపించకుండా మాస్క్ ధరించాడు. ఆప్ నేత మహీంద్ర థార్ కారు పార్కు చేస్తుండగా.. ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ద్విచక్రవాహనంపై మరో వ్యక్తితో కలిసి వచ్చి, ఘటన తర్వాత అదే బైక్ ఎక్కి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో థార్తో పాటు మరో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అధికార పార్టీ నేత హత్యతో భగవంత్ మాన్ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆప్ పాలనలో శాంతిభద్రతలు దారుణంగా మారాయని ఆరోపించాయి. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. గురుద్వారా వెలుపల ఆప్ నాయకుడిని పట్టపగలు హత్య చేయడం రాష్ట్రంలోని భయంకరమైన వాస్తవాన్ని బహిర్గతం చేసిందని అన్నారు. ‘అధికార పార్టీ నాయకులు కూడా సురక్షితంగా లేకుంటే, సాధారణ పౌరులకు ప్రాణాలు మీద ఏం ఆశ ఉంటుంది’ అని బజ్వా ప్రశ్నించారు.
భయం, సామూహిక హింస, పాలనలో లోపాలతో పంజాబ్ నిండిపోయిందని, ఆప్ ప్రభుత్వం పాలన కంటే ప్రజా సంబంధాలపై దృష్టి సారించిందని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని దీనికి ఎవరు బాధ్యులో సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలని బజ్వా డిమాండ్ చేశారు. అలాగే, శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం ఆప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.