|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 09:57 PM
భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. అయితే భారత్లో మా ఆటగాళ్లకు భద్రత లేదంటూ.. బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు ఆడే అవకాశం లభించింది. మరోవైపు బంగ్లాకు మద్దతు పాకిస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఏకంగా టీ20 వరల్డ్ కప్నే బాయ్కాట్ చేయాలని పాక్ భావించింది. కానీ ఐసీసీ కన్నెర్ర జేస్తుందనే భయంతో చివరికి వెనక్కి తగ్గింది. టీ20 వరల్డ్ కప్లో ఆడతాం కానీ.. ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడబోం అని పాకిస్థాన్ ప్రకటించింది.
భారత్తో మ్యాచ్లో పాకిస్థాన్ ఆడకపోతే.. ఆ జట్టు కీలకమైన రెండు పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఈ పాయింట్లు టీమిండియా ఖాతాలో పడతాయి. ఇది పాకిస్థాన్ తదుపరి దశకు చేరుకునే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఈ టెన్షన్లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఉండగానే.. ఆ జట్టుకు మరో షాక్ తగలబోయే సూచనలు కనిపిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 7న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం అవుతుంది. అయితే కొలంబోలోని సింహాళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వాతావరణం అనుకూలించకపోయే అవకాశం ఉంది. ఈ వేదిక మీదే.. పాకిస్థాన్, ఐర్లాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఎడతెగని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా ఈ మ్యాచ్ రద్దయ్యింది.
పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడబోయే శనివారం నాడు కూడా కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఆ రోజు వర్షం కురిసే అవకాశం 60-70 శాతంగా ఉంది. మ్యాచ్ జరిగే టైంలోనే వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో ఆటకు అంతరాయం కలగొచ్చు. ఒకవేళ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటే ఓవర్లను కుదించాల్సి వస్తుంది. కొలంబోలో వాతావరణం వేగంగా మారుతుంది. ఒకవేళ వర్షం గనుక భారీగా పడి మ్యాచ్ రద్దయితే.. పాకిస్థాన్, నెదర్లాండ్స్కు చెరో పాయింట్ కేటాయిస్తారు. భారత్తో మ్యాచ్ను కూడా బాయ్కాట్ చేస్తే.. రెండు మ్యాచ్లకుగానూ పాక్ ఖాతాలో ఒక్క పాయింటే చేరుతుంది.
దీని వల్ల పాకిస్థాన్ సూపర్ 8 చేరాలంటే.. గ్రూప్-ఏలో అమెరికా, నమీబియా జట్లతో మ్యాచ్లు చావో రేవో అన్నట్టుగా మారతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2024 టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ను అమెరికా జట్టు ఓడించింది. దీంతో పాక్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.
ఒకవేళ పాకిస్థాన్ ఆడే తొలి మ్యాచ్ రద్దయ్యి.. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే.. పాక్ గ్రూప్-8 చేరే అవకాశాలను సూర్య సేన ప్రభావితం చేయగలదు. అమెరికా గత టోర్నీలో పాక్పై చేసిన మ్యాజిక్ను రిపీట్ చేసి.. టీమిండియా ఒక మ్యాచ్లో ఓడితే గనుక.. పాకిస్థాన్ సూపర్-8కు చేరడం కష్టం అవుతుంది.
Latest News