ఏపీలో గర్భిణీలకు ఇక నుంచి ఉచితంగానే పంపిణీ
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 09:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో గర్భిణీలు, బాలింతలకు కూడా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాలు అందిస్తోంది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని.. పుట్టిన బిడ్డ క్షేమం కోసం.. గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీలకు కావాల్సిన అన్ని రకాల అవసరాలను తీర్చుతోంది. అయితే సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత మహిళలకు వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించి వాటిని నివారించే ప్రయత్నాలు చేస్తోంది.


ఇందులో భాగంగా రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (ఎఫ్‌సీఎం) ఇంజెక్షన్‌ను ఫ్రీగా అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ ఇంజెక్షన్‌ను కేవలం బాలింతలకు మాత్రమే అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాన్ని గర్భిణీలకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


గర్భిణీలకు రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ అందించనున్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒకటి లేదా రెండు ఇంజెక్షన్లతోనే గర్భిణీల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి వారికి ఉన్న రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో అవసరమైన గర్భిణీలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించనుంది. గతంలో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మళ్లీ అందుబాటులో తీసుకువచ్చినట్లు వెల్లడించింది.


మరోవైపు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలింతల కోసం 53,500 ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇంజెక్షన్లను ఇప్పటికే ఆయా జిల్లాలకు కూడా పంపించింది. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి 80.. ఏరియా ఆస్పత్రులకు 175.. జిల్లా ఆసుపత్రులకు 400 చొప్పున ఈ ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లను సరఫరా చేసింది.


ఇదే సమయంలో గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 18,500 ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లను కూడా త్వరలోనే సంబంధిత జిల్లాలకు పంపించేదుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లను గర్భిణీలకు ఎలా ఇవ్వాలి అనే అంశంపై త్వరలోనే జిల్లాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఎఫ్‌సీఎం ఇంజెక్షన్ తీసుకున్న గర్భిణీలకు హీమోగ్లోబిన్ స్థాయి 2 శాతం నుంచి 3 శాతం వరకు పెరిగినట్లు ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.

Latest News
Pakistan increases price of petrol by PKR 5, high-speed diesel by PKR 7.32 Mon, Feb 16, 2026, 03:57 PM
India, Greece discuss enhancing maritime cooperation Mon, Feb 16, 2026, 03:54 PM
AI Impact Summit 2026 puts India on global AI map: Raghav Chadha Mon, Feb 16, 2026, 03:40 PM
Auditors are custodians of public trust: President Murmu Mon, Feb 16, 2026, 03:38 PM
The game was out of Pakistan's reach once India reached 175: Waqar Younis Mon, Feb 16, 2026, 03:36 PM