|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:14 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో నిధులు తీసుకొచ్చి పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలస్యం అవుతున్న మరో కీలకమైన రైల్వే లైన్ పనులలో కీలక ముందడుగు పడింది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కుప్పం-మారికుప్పం (కర్ణాటక) కొత్త రైల్వే ట్రాక్ పనులు మరింత వేగవంతం చేశారు. ఈ రైల్వే లైన్ సమీపంలో 30 కిలో మీటర్లు వెళితే కర్ణాటక వస్తుంది.. ఇటు తమిళనాడు కూడా ఉంటుంది. కుప్పం రైల్వే స్టేషన్ కూడా చెన్నై-బెంగళూరు రైలు మార్గంలోనే ఉంది. ఈ స్టేషన్ మీదుగా రోజూ రైళ్లు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కుప్పం రైల్వే స్టేషన్ మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. అందుకే ఈ స్టేషన్ను ప్రస్తుతం అమృత్ భారత్లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు కుప్పం మారికుప్పం (కర్ణాటక) మధ్య కొత్త రైల్వేట్రాక్ పనులు పూర్తి చేసి.. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే ప్యాసింజర్ రైళ్ల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు.
2011లో 23.7 కి.మీ పొడవున కుప్పం-మారికుప్పం మధ్య కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు అధికారులు భూసేకరణ కోసం ప్రతిపాదనల్లో భాగంగా.. గుడుపల్లె మండలం పరిధిలోన గ్రామాల్లో 238.50, కుప్పం మండలంలోని గ్రామాల్లో 9.15 ఎకరాలు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. నాలుగేళ్ల క్రితం భూ సేకరణ కోసం ఆదేశాలు ఇచ్చారు. అయితే కర్ణాటక ప్రాంతంలో భూసేకరణ పనులు పూర్తి చేసుకుని మారికుప్పం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు పనులు వేగవంతం చేశారు. ఏపీ పరిధిలో మాత్రం ఈ రైల్వే ట్రాక్కు సంబంధించి పనులు చేయలేదు. గత ప్రభుత్వ హయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించింది.. ఇంకా కొందరికి చెల్లించాల్సి ఉంది.
ఈ కొత్త రైల్వే ట్రాక్కు సంబంధించి ఏపీ పరిధిలోని గుడుపల్లె, కుప్పం మండలాల్లో భూసేకరణ పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. రైతులకు రూ.1.68 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉందని.. వారికి డబ్బులు చెల్లించిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. కర్ణాటకలోని మారికుప్పం రైల్వే స్టేషన్ నుంచి కొత్త ట్రాక్ ప్రారంభమవుతుంది (అత్తినత్తం, బిసానత్తం, పొగురుపల్లె, కోటచెంబగిరి, కుప్పిగానిపల్లె, అగరం, కనమనపల్లె, గుండ్లసాగరం, నక్కనపల్లె, మల్దేపల్లె) ఏపీలోని కుప్పం రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది. అయితే రైతులకు ఆ పెండింగ్ నష్టపరిహారం డబ్బులు విడుదల చేస్తే పనులు మరింత వేగవంతం అవుతాయి అంటున్నారు. ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు వైపు కీలకమైన రైల్వే లైన్ ఇదే.