|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:04 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. వివేకా హత్యకేసు దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వును కూడా సుప్రీం కోర్టు సవరించింది. కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ దర్యాప్తు సమయంలో ఎవరినైనా విచారణ కోసం పిలవాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవని కూడా తెలిపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో అన్ని అంశాలు క్లారిటీ ఉన్నాయని.. దర్యాప్తును కొనసాగించాలని జస్టిస్ ఎంఎం సుందరేష్ ఆదేశించారు.
వివేకా హత్యకేసులో ట్రయల్ కోర్టు ఆదేశాలను సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశామని.. అయితే ట్రయల్ కోర్టు మాత్రం కొన్ని సాంకేతిక అంశాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించిన విషయాన్ని తెలిపారు. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు సీబీఐ అధికారులు. వివేకా కుమార్తె తరఫున లాయర్ కోర్టుకు ఓ రిక్వెస్ట్ చేశారు.. సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని కోరారు. ఆయన వచ్చే వరకు విచారణ ఆపాలని కోరగా.. కోర్టు వాయిదా వేసింది.. ఆ తర్వాత కొద్దిసేపటికి లూథ్రా రావడంతో విచారణ జరిపింది.
ఇదిలా ఉంటే కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ కోసం మినీ ట్రయల్ నిర్వహించలే.. ఒకవేళ అలా చేస్తే మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పడుతుంది.. అయితే సీబీఐ ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగించొచ్చు. ట్రయల్ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు కొసాగించాలి' అని తెలిపారు. మొత్తం మీద వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో.. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. ట్రయల్ కోర్టు మార్గదర్శకాలను అనుసరించి సీబీఐ దర్యాప్తును చేయనుంది.
Latest News