|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:59 PM
భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ప్రశ్న ఒక్కటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారా? లేదా? ఈ అంశంపై ఇప్పటికే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ తమ అభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో తాజాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ, ఈ అంశంపై తొలుత స్పందించడానికి కొంత వెనకాడినా, హోస్ట్ పదేపదే అడగడంతో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. “ఎందుకు ఆడకూడదు? వయస్సు నాకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదు. ఫిట్నెస్, ప్రదర్శన మాత్రమే ముఖ్యం. వయస్సును చూసి ఆటగాళ్లను తప్పించడం సరైంది కాదు,” అని ధోనీ అన్నాడు.
“22 ఏళ్ల వయస్సులో ఉండి ఫిట్గా లేకపోయినా అది సమస్యే. అలాగే 35, 38 ఏళ్ల వయస్సులో ఉండి బాగా ఆడితే తప్పించాల్సిన అవసరం లేదు. కోహ్లీ అయినా, రోహిత్ అయినా, ఎవరిదైనా అదే నియమం. వాళ్లు బాగా ఆడితే జట్టులో ఉండాలి” అని స్పష్టం చేశాడు. కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, ఫామ్ విషయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల చూపడం లేదు. ఇటీవల వన్డేల్లో కోహ్లీ వరుసగా పరుగులు సాధిస్తుండగా, రోహిత్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. 2027 వరల్డ్ కప్ సమయానికి కోహ్లీ వయసు 39, రోహిత్ వయసు 40కి చేరుకుంటుంది. అయినప్పటికీ ధోనీ తన అనుభవంతో చెప్పేది ఒక్కటే.. వయసుకన్నా ప్రదర్శనే ముఖ్యం.
“అనుభవం ఒక్క రోజులో రాదు. 16-17 ఏళ్ల వయస్సులో ఆడటం మొదలుపెట్టినవారికే అసలైన అనుభవం వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ చాలా కఠినమైనది. 20-25 మ్యాచ్లు ఆడితే అనుభవం వచ్చినట్టు కాదు” అని ధోనీ తెలిపాడు. తాను కూడా 39 ఏళ్ల వయసు వరకు భారత జట్టుకు ఆడిన విషయాన్ని గుర్తు చేసిన ధోనీ, అనుభవజ్ఞులపై నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇక కోచ్ గంభీర్, సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ, ధోనీ వ్యాఖ్యలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఫామ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడం సరైంది కాదనే సంకేతాలను ఆయన స్పష్టంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై ధోనీ వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రదర్శన కొనసాగితే, 2027 వరల్డ్ కప్లో ఈ ఇద్దరూ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.