|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 06:51 PM
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అరవ శ్రీధర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ.. రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ అరవ శ్రీధర్ మీద.. బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వీడియోలను రికార్డ్ చేస్తున్న సంగతి అరవ శ్రీధర్కు తెలుసని అన్నారు. అరవ శ్రీధర్ తనతో కాకుండా మరో ఆరుమంది అమ్మాయిలతోనూ మాట్లాడేవారని బాధితురాలు ఆరోపించారు. వారిని కలిసేవాడని.. బయటకు తీసుకెళ్లేవారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలిసిన తర్వాత.. జరిగిందంతా పీడకలగా భావించి వదిలేద్దామనుకున్నానని..
కానీ అరవ శ్రీధర్ ఒప్పుకోలేదన్నారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పెళ్లికి అంగీకరించానని.. అయితే ముందు జాగ్రత్తగా వీడియోలు రికార్డు చేశానని అన్నారు.ప్రస్తుతం అరవ శ్రీధర్ ఫోన్ స్విచాఫ్ అయ్యిందని.. తనను దూరం పెట్టడం ప్రారంభించారని ఆరోపించారు. మరోవైపు రైల్వేకోడూరులో అరవ శ్రీధర్ డమ్మీ క్యాండిడేట్ అని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. అరవ శ్రీధర్ను తాను 25 కోట్లు అడిగాననేది పూర్తిగా అబద్ధమని.. ఆ వాయిస్ తనది కాదని చెప్పుకొచ్చారు.
మరోవైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలపై జనసేన విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజున రైల్వేకోడూరు వచ్చిన జనసేన త్రిసభ్య కమిటీసుదీర్ఘంగా విచారించింది. కమిటీ సభ్యులు శివశంకర్, రమాదేవి, వరుణ్.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విచారించింది.
బాధితురాలి ఆరోపణలు, వాట్సప్ చాటింగ్, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దానిపై అరవ శ్రీధర్ను ప్రశ్నించారు. అరవ శ్రీధర్తో పాటుగా స్థానిక నేతలను కూడా జనసేన విచారణ కమిటీ వివరాలు అడిగి తెలుసుకుంది. విచారణ అనంతరం పూర్తి నివేదికను అధినేత పవన్ కళ్యాణ్కు కమిటీ అందించనుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నట్లు అరవ శ్రీధర్ ప్రకటించారు. అధినేత నిర్ణయమే తనకు శిరోధార్యమంటూ అరవ శ్రీధర్ మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
Latest News