|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:19 PM
ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడన్న చిన్న కారణం ఒక యువకుడి ప్రాణం తీసింది. మనస్పర్థల నేపథ్యంలో తన నంబర్ను బ్లాక్ చేసిన ప్రియుడిని, ఒక యువతి కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం.. ప్రసాద్ సూర్యవంశీ (25) అనే యువకుడు స్థానిక టీచర్స్ కాలనీలో నివసిస్తూ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక యువతితో అతనికి ప్రేమ వ్యవహారం ఉంది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రసాద్ తన ప్రియురాలి ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు.ఫోన్ నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీయడానికి ఆమె ప్రసాద్ ఇంటికి వెళ్లింది. అతడి మొబైల్లోని చాటింగ్ వివరాలు చూపించాలని పట్టుబట్టింది. ప్రసాద్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆమె, వెంట తెచ్చుకున్న కత్తితో అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న బిలాస్పుర్ ఎస్పీ రజనీశ్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Latest News