|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:41 AM
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భద్రతా విధుల్లో ఉన్న 'ఏఎస్సీ అర్జున్' అనే హ్యూమనాయిడ్ రోబో తన సత్తా చాటింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబో, ఇద్దరు పాత నేరస్థులను గుర్తించి, వారిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి 8.10 గంటల సమయంలో స్టేషన్ ప్రాంగణంలో 'అర్జున్' విధుల్లో ఉంది. అప్పటికే నేరస్థుల వివరాలు, ఫొటోలను రోబోలో అప్లోడ్ చేసి ఉంచారు. స్టేషన్లో తిరుగుతున్న ఇద్దరు అనుమానితులను రోబో తన కెమెరాతో చిత్రీకరించి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పాత నేరస్థులుగా గుర్తించింది. వెంటనే ఈ సమాచారాన్ని, సీసీటీవీ ఫుటేజీ వివరాలను కంట్రోల్ రూమ్కు పంపింది.రోబో నుంచి సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ బీఎస్. నారాయణ, ఎస్సై వి. కీర్తి రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి శివ, బంగారు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్రయాణ టికెట్లు కూడా లేవని గుర్తించారు. విచారణలో వీరిద్దరిపై రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి, రాయగడ పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్ర స్పందిస్తూ, పాత నేరస్థులను గుర్తించడంలో ఏఐ ఆధారిత రోబో సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో నేర నియంత్రణలో ఇలాంటి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Latest News