|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 06:39 AM
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకేచోట ఉండేలా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొచ్చారని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులను భాగస్వాములను చేస్తూ, సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు.రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, వారి ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని వివరించారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయాలను ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలన్నారు. సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.సంప్రదాయ పంటలతో పాటు, వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా, లంబసింగి ప్రాంతంలో స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కుంకుమపువ్వు సాగు చేపట్టే సంస్థలకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అరటి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నా, ఎగుమతుల్లో వెనుకబడ్డామని, ఇకపై ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమల బలోపేతానికి కూడా ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఆక్వా రైతులు తమ సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకునే విధానాన్ని అమలు చేయాలన్నారు. పౌల్ట్రీ రంగానికి ఊతమిచ్చేలా, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టులను నేరుగా రైతులకే అప్పగించాలని నిర్దేశించారు.ఎల్నినో వంటి వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’ వంటి టెక్నాలజీలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ‘డిజి రైతు బజార్’ ఏపీఏఐఎంఎస్’ కిసాన్ డ్రోన్’ యాప్లను సీఎం ఆవిష్కరించారు. వీటి ద్వారా రైతులు కూరగాయలు ఆన్లైన్లో అమ్మడం, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు అద్దెకు తీసుకోవడం వంటి సేవలు పొందవచ్చని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News