|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:39 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వారసత్వంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, తన తర్వాత ఎలా గుర్తుండిపోవాలనే దానిపై ఆయన మధనపడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి.ఎరిక్ ట్రంప్ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. "ఆయనకు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. మరణం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ ఆలోచించడానికి ఇష్టపడరు. వర్తమానంలో జీవించడానికే ప్రాధాన్యం ఇస్తారు" అని తెలిపారు. తన తండ్రికి ఇంకా చాలా సంవత్సరాల ఆయుష్షు ఉందని తాను నమ్ముతున్నట్లు ఎరిక్ పేర్కొన్నారు.ఇటీవల ట్రంప్ చేతులపై గాయాలు, కాళ్ల వాపుల వంటి సమస్యలపై వార్తలు వచ్చాయి. దీనిపై వైట్హౌస్ స్పందిస్తూ.. తరచుగా కరచాలనం చేయడం, అధిక మోతాదులో ఆస్పిరిన్ వాడటం వల్లే చేతులపై గాయాలు ఏర్పడ్డాయని వివరించింది. వైద్యులు సూచించిన దానికంటే ఎక్కువగా రోజుకు 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ తీసుకుంటున్నట్లు ట్రంప్ స్వయంగా అంగీకరించారు. కొద్ది కాలం క్రితం ఆయనకు నిర్వహించిన సీటీ స్కాన్ ఫలితాలు "పర్ఫెక్ట్గా" ఉన్నాయని వైద్యులు తెలిపారు.
Latest News