|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:25 PM
ఆస్ట్రేలియా చరిత్రలో గత మూడు దశాబ్దాలలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడికి పాల్పడ్డ నిందితుడు నవీద్ అక్రమ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆదివారం సిడ్నీలోని ప్రఖ్యాత బోండీ బీచ్లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన నవీద్.. మంగళవారం మధ్యాహ్నం స్పృహలోకి వచ్చాడు. అతను కళ్లు తెరవగానే హాస్పిటల్ బెడ్పైనే సిద్ధంగా ఉన్న డిటెక్టివ్లు అతడిని అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు.
59 నేరారోపణలు.. కఠిన సెక్షన్లు
నవీద్ అక్రమ్పై ఆస్ట్రేలియా పోలీసులు అత్యంత కఠినమైన 59 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక ఉగ్రవాద చర్య, 15 హత్యలు, 40 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అంతేకాకుండా జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో పేలుడు పదార్థాలను అమర్చడం, తీవ్ర హాని కలిగించే ఉద్దేశంతో ఆయుధాలను వాడటం, ఉగ్రవాద చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడం వంటి తీవ్రమైన ఆరోపణలను అతను ఎదుర్కొంటున్నాడు. నిందితుడు చట్టపరమైన ప్రక్రియలను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడని.. వైద్యులు ధృవీకరించిన తర్వాతే పోలీసులు అరెస్ట్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కేసులో అత్యంత సంచలన విషయం ఏమిటంటే.. ప్రధాన నిందితుడు, పోలీసుల కాల్పుల్లో హతమైన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్. 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. అక్కడే ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. అతనికి ఒక కుమారుడు (నవీద్), కుమార్తె ఉన్నారు. సాజిద్ ఇప్పటికీ భారత పాస్పోర్టునే కలిగి ఉన్నాడని.. అయితే గత 27 ఏళ్లలో కేవలం ఆరుసార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడని తెలంగాణ పోలీసులు ధృవీకరించారు. ఈ తండ్రీకొడుకులు నవంబర్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఫిలిప్పీన్స్లో పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ వీరు ఇస్లామిక్ స్టేట్ (ISIS) సానుభూతిపరులను కలిశారని, సైనిక తరహా శిక్షణ పొందారని ఆస్ట్రేలియా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే వీరి రాడికలైజేషన్కు భారత్తో గానీ, తెలంగాణతో గానీ ఎటువంటి సంబంధం లేదని డీజీపీ స్పష్టం చేశారు.
హనుక్కా పండుగ వేడుకల కోసం బోండీ బీచ్లో గుమిగూడిన వందలాది మందిపై ఈ తండ్రీకొడుకులు రైఫిళ్లు, షాట్గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 ఏళ్ల చిన్నారి నుంచి 87 ఏళ్ల వృద్ధుడి వరకు మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గాయపడిన 40 మందిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. నిందితుడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై లోతైన విచారణ కొనసాగుతోంది.
Latest News