|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:20 PM
ప్రయాణికుల సౌకర్యార్ధం టిక్కెట్ రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్లో రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి మార్పులు చేసింది. ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి ఈ ఏడాది జులై నుంచి 4 గంటలుగా ముందు తయారుచేసే చార్టును 8 గంటల ముందు షెడ్యూల్ చేస్తోంది. తాజాగా, మరో 2 గంటల పెంచుతూ దాదాపు 10 గంటల ముందుగానే రిజర్వేషన్ చార్టు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రైల్వే బోర్డు అప్డేట్ చేసింది. దీంతో 10 గంటల ముందే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది? లేనిదీ? తెలుసుకోవడం ద్వారా ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తత్కాల్ టిక్కెట్ బుకింగ్కు ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు రిజర్వేషన్ చార్టు ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా ఖరారవుతుంది. అలాగే, మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటలు; అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు కనీసం 10 గంటల ముందు చార్జును సిద్దం చేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. చార్జ్ ప్రిపరేషన్కు తాజా షెడ్యూల్ ప్రకారం సత్వరమే చర్యలు తీసుకోవాలని అని జోన్లకు ఈ మేరకు రైల్వే బోర్డు లేఖ రాసింది. ఈ విధానం వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు చివరి నిమిషంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి ఈ సవరణ చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ముందస్తు చార్ట్ తయారీ వల్ల ప్రయాణికులు వసతి, ప్రయాణ ఏర్పాట్లను అనుసంధానించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికలకు సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రైల్వే శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణీకుల సౌలభ్యం కోసం, చార్ట్ ముందుగానే సిద్ధమవుతుందని, దీనివల్ల ప్రయాణ ప్రణాళిక సజావుగా సాగుతుందని అన్నారు.
ఇదిలా ఉండగా, ఐఆర్సీటీసీ ఇ-వాలెట్లో డిపాజిట్ చేసిన నగదు విత్డ్రా చేయడం కుదరదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. కేవలం రైలు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చని తెల్చిచెప్పారు. ఒకవేళ, అకౌంట్ పూర్తిగా క్లోజ్ చేసిన సందర్భంలోనే దానిలో ఉన్న మొత్తం యూజర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుందని తెలిపారు. ఈ మేరకు లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలు విత్డ్రాకు అనుమతించవని పేర్కొన్నారు.
Latest News