|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:24 PM
గ్రామాలు, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు, చర్యలు చేపడుతుంటాయి. వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంటాయి. రోడ్లు, కరెంట్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల దగ్గర నుంచి స్కూళ్లు, ఆస్పత్రులు వంటి నిర్మాణాల వరకూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయితే మీ ఊరికోసం ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది.. ఏయే పనులు చేపట్టారనే సంగతి మీకు తెలుసా.. అలాగే కేటాయించిన నిధులలో ఏయే పనుల కోసం ఎంతెంత ఖర్చు చేశారనే దానిపై మీకు అవగాహన ఉఁదా.. ఇలాంటివాటి వివరాలు అందించేందుకు ప్రభుత్వం ఓ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ యాప్ సాయంతో మీ ఊరికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది.. అందులో ఎంత ఖర్చు చేశారు.. ఏయే పనులు చేపట్టారనే సంగతి తెలుస్తుంది.
ప్రజలకు ఈ వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో గ్రామ స్వరాజ్య పేరుతో ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీ ఊరికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందనే విషయాలు తెలుసుకునేందుకు ఈ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్లోకి వెళ్లి రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలను ఎంచుకోవాలి.
ఆ తర్వాత సబ్మిట్ చేస్తే.. ఈఆర్ డిటైల్స్, అప్రూవ్డ్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. అందులో అప్రూవ్డ్ యాక్టివిటీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే.. ఏయే పనులకు ఎంత నిధులు ఖర్చు చేశారో తెలుసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే.. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చాయనేదీ తెలుస్తుంది.
మరోవైపు పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభఆ ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తుంటాయి. ఏటా విడుదల చేసే ఈ నిధుల సాయంతో ఆయా పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతులకు ఖర్చు చేస్తుంటారు. అలాగే ఆర్థిక సంఘం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద కూడా పంచాయతీలకు నిధులు కేటాయిస్తుంటారు. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల సహకారం, ఆమోదంతో ఈ నిధులను ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Latest News