|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:19 PM
అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 4929 మంది పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అర్హులైన వారి నుంచి సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరిస్తోంది. పింఛన్ల కోసం గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని.. లేదా గ్రామసభల సమయంలోనూ అందించవచ్చని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
అమరావతి రాజధాని గ్రామాలైన యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా పింఛన్ల కోసం రైతులు, రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి. భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5 వేలు పింఛన్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పింఛన్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. సుమారుగా 3298 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్సులను అధికారులు తీసుకున్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులలో ఎక్కువగా నవులూరు నుంచి 1150, ఆ తర్వాత యర్రబాలెంలో 1100 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాజధాని అమరావతికి భూసమీకరణ చేసిన సమయంలో.. భూమి లేని పేదలకు పింఛన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వారికి నెలకు రూ.2500 చొప్పున పింఛన్లు అందించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. 2024లో వైసీపీ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచింది. అలాగే వివిధ కారణాలతో కొంతమందికి పింఛన్లు రద్దు అయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామసభలు, సీఆర్డీఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Latest News