|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:32 PM
దేశంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యం అయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురికి కేరళ కోర్టు కఠిన శిక్ష విధించింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అలానే బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ప్రముఖ మలయాళ నటిపై కేరళలో జరిగిన లైంగిక దాడి కేసులో భాగంగా కోర్టు ఆరుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి.. గతంలో నిర్భయ కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నిందితులకు తక్కువ శిక్షే పడిందన్నారు.
తెలుగుతో పాటు మలయాళం, తమిళం సినిమాల్లో నటించిన ఓ ప్రముఖ నటి ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్కు గురయ్యారు. ఆమెను కారులో బంధించిన దుండగులు.. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. కొచ్చిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ కేసులో.. నటుడు దిలీప్తో పాటు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, గ్యాంగ్రేప్, లైంగిక వేధింపులు, ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపేయడం వంటి ఆరోపణల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో 2017లోనే తొలి ఛార్జిషీట్ నమోదైంది. అదే సంవత్సరం జులైలో నటుడు దిలీప్ను అరెస్ట్ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది. అలానే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురికి కూడా తాజాగా ఉపశమనం లభించింది. మిగిలిని ఆరుగురు నిందితులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాలపై వారిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అలానే బాధితురాలికి రూ. 5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు వెల్లడించిన తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనిపై స్పందిస్తూ.. మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులకు తక్కువ శిక్షే పడిందన్నారు. త్వరలోనే దీనిపై కేరళ హైకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో చివరకు నిందితులకు శిక్ష విధించారు.