|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:49 PM
సౌతాఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమిండియాకు షాక్ ఇచ్చింది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు భారత ఆటగాళ్లకు ఫైనల్ విధించింది. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా ఓవర్లు వేయలేదని.. 2 ఓవర్లు తక్కువగా వేశారని పేర్కొంది. దీంతో ఓవర్కు 5% చొప్పున, రెండు ఓవర్లకు కలిపి 10% మ్యాచ్ ఫీజును ఫైన్గా విధించింది ఐసీసీ.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ జరిమానా ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5% కోత పడుతుంది. చేసిన తప్పును టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఈ అంశంపై విచారణను ఐసీసీ ముగించింది.
రాయ్పూర్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో మరో నాలుగు బంతులు ఉండగానే.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ రావడంతో టీమిండియా కెప్టెన్.. ఆచీతూచీ నిర్ణయాలు తీసుకున్నాడు. బౌలర్ల వద్దకు పదే పదే వెళ్లి సలహాలు ఇచ్చాడు. దీంతో నిర్దేశిత సమయానికి భారత్.. పూర్తి ఓవర్లు వేయలేకపోయింది.
ఇక భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలుత టెస్ట్ సిరీస్ జరిగింది. అందులో 2-0తో సౌతాఫ్రికా గెలుపొందింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచింది. ఇక విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. 39.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది.