|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:48 PM
సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాలో మాట్లాడాడు. ఈ సందర్భంగా శుభ్మన్ గిల్ , హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో జట్టులో ఓపెనర్లుగా ఎవరెవరు బరిలోకి దిగుతారో క్లారిటీ ఇచ్చేశాడు. సంజూ శాంసన్ కంటే కూడా.. శుభ్మన్ గిల్.. ఓపెనర్గా వచ్చేందుకు అర్హుడని వ్యాఖ్యానించాడు. స్థిరంగా ఉండవని మరోసారి స్పష్టం చేశాడు. డిసెంబర్ 9 అంటే మంగళవారం రాత్రి 7 గంటలకు కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది.
“సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరుగుతాయి. మూడో స్థానం నుంచి ఆరో బ్యాటర్ వరకు ఆటగాళ్ల పొజిషన్ మారుతూనే ఉంటుంది. ఓపెనర్లు తప్పా మరే ఆటగాడికి కూడా ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ ఉండదు. జట్టులో ఏ స్థానంలోనైనా సత్తాచాటే ఆటగాళ్లు ఉన్నారు. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. తొలి టీ20లో తిలక్ వర్మ ఆరో స్థానంలో.. శివమ్ దూబే మూడో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. ఇదే మా స్టైల్” అని సూర్యకుమార్ అన్నాడు.
ఓపెనర్గా ఎవరంటే..
“సంజూ శాంసన్ ఓపెనర్గా పరుగులు చేశాడు. కానీ అతడి కంటే ముందే గిల్ ఓపెనర్గా ఆడాడు. అందుకే ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఆడిస్తున్నాం. అందుకు గిల్ పూర్తి అర్హుడు. సంజూ శాంసన్కు చాలా అవకాశాలు ఇచ్చాం. సంజూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. అతడి లాంటి ఆటగాళ్ల వల్ల కెప్టెన్గా నా పని మరింత ఈజీ అవుతుంది. ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్లో ఆడగలిగే సత్తా అతడికి ఉంది” అని టీమిండియా టీ20 కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్.
Latest News