|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:23 PM
జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం పార్లమెంట్ వేదికగా ప్రత్యేక చర్చ జరిగింది. లోక్సభలో ఈ చర్చను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. 'వందేమాతరం మంత్రం' స్వాతంత్ర్య సమరంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చిందని మోదీ అన్నారు.
ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. "వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచాం. దేశం సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటోంది. ఈ చర్చ సభ నిబద్ధతను తెలియజేయడంతో పాటు భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతోంది" అని ప్రధాని మోదీ తెలిపారు.
వందేమాతరం రచించినప్పుడు భారత్ బానిసత్వంలో ఉందని.. దానికి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు దేశంలో రాజ్యాంగం గొంతు నొక్కేసిన చీకటి కాలం (ఎమర్జెన్సీ) నడిచిందని గుర్తు చేశారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే.. లక్షలాది మంది వందేమాతరం ఆలపించడంతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలకులు 'గాడ్ సేవ్ ద క్వీన్' అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో.. బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని మోదీ గుర్తు చేశారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని.. బ్రిటీష్ పాలన నుంచి భారతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధం అని ఆయన అన్నారు.
వందేమాతరం ఈ భూమి నా తల్లి, నేను భూమి పుత్రుడిని అనే భావనను కల్గిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ గీతం పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆశలను నింపిందని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటం కేవలం భూమి, అధికారం కోసం కాదని.. బానిసత్వ సంకెళ్లను తెంచుకొని సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికే అన్న సందేశాన్ని వందేమాతరం ఇచ్చిందని వివరించారు. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాలు లేవని మోదీ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఐక్యంగా అంతా ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఈ గీతం మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చడానికి స్ఫూర్తిని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భరంగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని కోరారు. విపక్ష కాంగ్రెస్ తరపున లోక్సభలో పార్టీ ఉప నేత గౌరవ్ గొగొయ్, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొననున్నారు.
Latest News