|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:13 PM
దేశవ్యాప్తంగా జరుగుతున్న రేప్లు, లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణలో.. హైకోర్టులు, కింది కోర్టులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ఇస్తున్న వివాదాస్పద తీర్పులపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో మహిళలకు వ్యతిరేకంగా ఇస్తున్న ఆదేశాలపై.. సోమవారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను అరికట్టేందుకు.. ఇలాంటి కేసులకు సంబంధించిన మరింత సమాచారం సేకరిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఆ తర్వాత హైకోర్టులు, కింది కోర్టుల కోసం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపింది.
లైంగిక దాడి కేసుల విషయంలో కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు, ఆదేశాలు బాధితులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ఆదేశాల కారణంగా లైంగిక దాడి బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. దానివల్ల వారు కేసులను ఉపసంహరించుకునేందుకు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్ని కేసుల వివరాలు అందుబాటులోకి వస్తే.. దిగువ కోర్టులు, హైకోర్టులు సరైన విధానాన్ని అనుసరించడానికి సహాయపడే సమగ్ర మార్గదర్శకాలను సుప్రీంకోర్టు రూపొందించగలదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుమోటో విచారణ
ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక వివాదాస్పద ఆదేశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక కేసు విచారణ సందర్భంగా మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, తాకడం దుష్ప్రవర్తనగా పరిగణించబడుతుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. బాలిక బట్టలను చించడం రేప్ కిందికి రాదంటూ ఇచ్చిన తీర్పు పెను వివాదానికి కారణం అయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ఇతర హైకోర్టులు ఇచ్చిన ఇలాంటి వివాదాస్పద ఆదేశాలు ఇచ్చిన రికార్డులను కూడా కోరింది.
ఈ కేసు విచారణ సందర్భంగా.. దేశంలోని ఇతర కోర్టుల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు సీనియర్ లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలహాబాద్ హైకోర్టుతోపాటు.. కలకత్తా హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టుల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయని సీనియర్ లాయర్ శోభా గుప్తా ఆరోపించారు. బాధితులను భయపెట్టే, ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని బలవంతం చేసే వ్యాఖ్యలు లేదా విధానాలు ఉండకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అన్ని ఉదాహరణలను తీసుకొస్తేనే సమగ్ర మార్గదర్శకాలు ఇస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
Latest News