|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:26 PM
వీధి వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి.. స్మార్ట్ స్ట్రీట్ లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా రోడ్డుపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అయితే నెల్లూరు నగరంలో ఇప్పటికే స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేశారు. అక్కడ విజయవంతం కావటంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాను ఎంపిక చేశారు. అయితే జిల్లా మొత్తానికి కేవలం అనంతపురం నగరం మాత్రమే స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు కోసం ఎంపికైంది. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ నుంచి బళ్లారి బైపాస్లోని అన్న క్యాంటిన్ వరకు ఉన్న ఫ్లైఓవర్ కింది భాగంలో ఈ స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు.
ఇందులో భాగంగా మొత్తం 100 షాపులు ఈ స్మార్ట్ స్ట్రీట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మార్ట్ స్ట్రీట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కంటైనర్ల ద్వారా చిరువ్యాపారులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇప్పటి వరకూ సుమారుగా 3 వేల500 మంది వీధి వ్యాపారులుగా నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీ వరకూ సమయం ఉంది. స్వయం సహాయక సంఘాలలోని సభ్యుల కుటుంబాలు, వీధి వ్యాపారులు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గలిగిన వారు.. నగరపాలక మెప్మా విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుదారులకు ఉండాల్సిన అర్హతలు..
మరోవైపు స్మార్ట్ స్ట్రీట్లో కంటైనర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు.. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులుగా నమోదై ఉండాలి. వీటితో పాటుగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, ఓటరు కార్డు, ఫోటోలతో దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు స్పందన ఎక్కువగా ఉంటే.. మరిన్ని కంటైనర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు వెల్లడించారు. స్మార్ట్ స్ట్రీట్ కోసం ఇప్పటికే అనంతపురం కార్పొరేషన్ నుంచి అనుమతి కూడా లభించిన నేపథ్యంలో త్వరలోనే అనంతపురంలో స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Latest News