|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:16 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. సాగర తీరం విశాఖను ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో విశాఖపట్నం సహా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. దీనికి తగినట్లుగానే నిర్మాణ రంగం కూడా పుంజుకుంది. అయితే విశాఖలో నిర్మాణ రంగాన్ని ఓ సమస్య ఇబ్బంది పెడుతోందని నిర్మాణ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతున్నాయి, అయితే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా విశాఖపట్నం నగర వృద్ధి మందగిస్తోందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్-సిటీ అప్గ్రేడ్లు, విమానాశ్రయ విస్తరణ, గృహనిర్మాణ ప్రాజెక్టులలో పురోగతి ఉన్నప్పటికీ.. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా వీటి అమలు ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఫలితంగా ఖర్చులను పెంచుతోందని కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అనుభవజ్ఞులైన మేసన్లు, ఎలక్ట్రీషియన్లు, ఫినిషింగ్ కార్మికులు దొరకడం లేదని చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని.. ఫలితంగా ఖర్చులు పెరగడమే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని చెప్తున్నారు.
మరోవైపు విశాఖపట్నం నగరంలో మరిన్ని పనులు చేపట్టడానికి బిల్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వేధిస్తోందని క్రెడాయ్ అధికారులు చెప్తున్నారు. విశాఖపట్నం దాని మౌలిక సదుపాయాల లక్ష్యాలను చేరుకోవాలంటే బలమైన, నమ్మదగిన శ్రామిక శక్తి అవసరమని వెల్లడిస్తు్న్నారు. సిబ్బందిలో పనితనాన్ని మెరుగుపరచడానికి , బిల్డర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి క్రెడాయ్ నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు.
మరోవైపు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత కారణంగా విశాఖపట్నంలో ఇప్పటికే మున్సిపల్ ప్రాజెక్టుల నిర్మాణాలు మందగించాయి. ముఖ్యంగా రోడ్డు పనులు, పబ్లిక్ హాస్టళ్ల వంటి మునిసిపల్ ప్రాజెక్టులను నెమ్మదించాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగే ఆలస్యమయ్యే కొద్దీ ఇళ్లు కొనుగోలు చేసే వారిలో విశ్వాసం తగ్గుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కోసం.. స్కేల్-అప్ అప్రెంటిస్షిప్లు, కాంట్రాక్టర్-ఇన్స్టిట్యూట్ లింకేజీలు, ప్రోత్సాహకాలు వంటివి అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.