|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:10 PM
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పనితీరు మెరుగుపడిందని, అయితే మరో 37 మంది పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమీక్షలు, వన్ టూ వన్ భేటీల ద్వారా చాలామంది పనితీరులో మార్పు వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నివేదికల ఆధారంగానే పనితీరును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమావేశంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ విషయాన్ని కొందరు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ "నెలకోసారి వచ్చి విజ్ఞత కోల్పోయి మాట్లాడే వారి మాటలకు విలువ లేదు. అర్థం పర్థం లేని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు" అని వ్యాఖ్యానించారు.
Latest News