|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 09:23 PM
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరంతా శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ రామవేశ్వరం వెళ్లారు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వస్తుండగా అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారిలో ముగ్గురిని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలసకు చెందినవారిగా గుర్తించారు. మరొకరిని గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
చనిపోయినవారిని కొత్తవలస వాసులు వంగర రామకృష్ణ (51), మార్పిన అప్పలనాయుడు (33), మరాడ రాము (50).. మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు (35) గా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి సీఎం ఆరా తీశారు. అలాగే చనిపోయినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మృతి చెందిన ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యల తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
శబరిమల దైవదర్శనం కోసం వెళ్లి వస్తున్న భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకున్నారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సహకరించాలన్నరు. అలాగే యాత్రల్లో రాత్రిపూట ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.