|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 09:22 PM
రాష్ట్రంలో అవినీతి, అక్రమాస్తులు, లంచం కేసుల్లో ఉన్నతాధికారులు పట్టుబడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదనపు కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు కీలకమైన అవినీతి కేసులు వెలుగులోకి రావడం ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. తాజాగా, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసభ్యంగా మాట్లాడుతున్నారు..తట్టుకోలేకున్నా.. నా మనోవేదన అర్థం చేసుకోండి.. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్..
శుక్రవారం (డిసెంబర్ 5) హనుమకొండ జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వెంకట్ రెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేయడంతో పాటు, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన రెన్యువల్ ఫైల్ను క్లియర్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నుంచి ఆయన లంచం డిమాండ్ చేశాడు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా లంచానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతకుముందు రోజు గురువారం ( డిసెంబర్ 4 ) రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సదరు అధికారి అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు లభించాయి. ఏసీబీ లెక్కల ప్రకారం.. సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఆ అధికారిపై పలు కేసులు నమోదు చేసింది. ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరిస్తోంది. లంచాల కోసం ప్రజల్ని పీడిస్తే ఉద్యోగాలు పోవటంతో పాటు జైలు జీవితం గడపాల్సి వస్తోందని అంటున్నారు. అందుకే ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలని సూచిస్తున్నారు.