|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:49 PM
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో అనూహ్యమైన ఓ దొంగతనం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయల విలువైన వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన గుడ్డు ఆకారంలో ఉన్న ఒక ప్రత్యేకమైన లాకెట్ను ఓ దొంగ మింగేశాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. కానీ ఆ లాకెట్ను స్వాధీనం చేసుకోవడానికి మాత్రం తంటాలు పడ్డారు. చివరాఖరికి ఆ పద్ధతిలోనే లాకెట్ను చేజిక్కించుకున్నారు.
సెంట్రల్ ఆక్లాండ్లోని ప్రముఖ జ్యువెలరీ దుకాణం ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్ దుకాణంలో ఈ దొంగతనం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి, అత్యంత విలువైన ఆభరణాన్ని అపహరించాడు. అయితే దొంగిలించిన తర్వాత దానిని దాచుకునే క్రమంలో అకస్మాత్తుగా ఆ గుడ్డు ఆకారంలో ఉన్న లాకెట్ను మింగేసినట్లు దుకాణ యజమాని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకున్నారు.
లాకెట్ విలువ ఎంతంటే?
పోలీసుల విచారణలో ఆ లాకెట్ విలువ, ప్రత్యేకత బయటపడింది. ఆభరణాల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, ఆ లాకెట్లో దాదాపు 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులను పొదిగారు. దాంతో పాటు 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఒక చిన్న ఆక్టోపస్ బొమ్మ కూడా అందులో ఉంది. దీని మొత్తం విలువ 20 వేల అమెరికన్ డాలర్లు ఉంటుందని దుకాణ యజమాని తెలిపారు. అంటే మన కరెన్సీలో రూ.18 లక్షలు ఉంటుందని అంచనా.
నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత, లోపలికి వెళ్లిన లాకెట్ను బయటకు తీయడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిందితుడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. లాకెట్ జీర్ణ వ్యవస్థలో ఎక్కడా ఇరుక్కుపోకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా, సహజ ప్రక్రియ ద్వారా లాకెట్ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. ప్రస్తుతం నిందితుడు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు న్యూజిలాండ్ పోలీసులు తెలిపారు.
ఈ చోరీకి సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే దుకాణం నుంచి నిందితుడు ఒక ఐప్యాడ్ను కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డిసెంబర్ 8వ తేదీన అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ దొంగతనం కేసు ఇటు స్థానిక మీడియాలో, అటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.
Latest News