|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:31 PM
నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రెండు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్కు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అయితే పర్యటన ప్రారంభమైన కొద్ది గంటల్లోనే.. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై అమెరికా చేస్తున్న ఒత్తిడిని పుతిన్ బలంగా ఖండించారు. భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పుతిన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. "అమెరికా ఇప్పటికీ దాని అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అది కూడా ఇంధనమే కదా" అని పుతిన్ అన్నారు.
అమెరికాకే మా ఇంధనాన్ని కొనే హక్కు ఉంటే.. భారత్కు అదే హక్కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అలాగే ఈ ప్రశ్నకు లోతైన పరిశీలన అవసరం అని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా దీనిని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని, యూఎస్ కూడా మాస్కోతో వాణిజ్యాన్ని కొనసాగిస్తోందని భారత్ గతంలో స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోలు చేస్తూ.. భారత్ మాస్కో-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక సహాయం చేస్తుందంటూ ట్రంప్ అనేక మార్లు చెప్పారు. ఈ వాదనల నేపథ్యంలోనే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పశ్చిమ దేశాల ఒత్తిడి కారణంగా భారత చమురు కొనుగోళ్లు తగ్గాయా అనే ప్రశ్నకు పుతిన్ స్పందించారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వాణిజ్య టర్నోవర్లో కొంత క్షీణత ఉన్నప్పటికీ.. మొత్తం వాణిజ్యం మునుపటి స్థాయిలోనే ఉందని చెప్పారు. రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వాణిజ్యం భారత్లో సజావుగా సాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024-25లో వాణిజ్యం దాదాపు 69 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.
విమానాశ్రయంలో పుతిన్కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. పుతిన్ రాగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆపై ఈ ఇద్దరు దేశాధినేతలు ఒకే వాహనంలో ప్రైవేట్ విందు కోసం ప్రధాని నివాసానికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే.. మోదీ పుతిన్కు ఓ అద్భుతమైన బహుమతిని అందజేశారు. ముఖ్యంగా రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీతను ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఇద్దరు నేతలు శిఖరాగ్ర చర్చలు నిర్వహించనున్నారు. భారత్ రష్యాకు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు వంటి వస్తువుల ఎగుమతులను పెంచాలని చూస్తుండగా.. రష్యా భారత్కు రక్షణ, ఇంధన రంగంలో ఒప్పందాలను ప్రకటించనుంది.
Latest News