అమరావతిని క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు
 

by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:57 PM

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక 'క్రియేటివ్ సిటీ'గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. రాజధాని భవనాల డిజైన్ల కోసం గతంలోనే విస్తృతమైన అధ్యయనం చేశామని సీఎం గుర్తుచేశారు.అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో గవర్నర్ నివాస సముదాయమైన 'లోక్ భవన్' నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ భవనాన్ని రూ.169 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అదేవిధంగా, రూ.165 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. వీటితో పాటు 2024-25 వార్షిక గణాంకాల నివేదికలను కూడా అథారిటీ ఆమోదించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు నుంచి రూ.7,380 కోట్ల భారీ రుణాన్ని స్వీకరించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ అథారిటీ అంగీకారం తెలిపింది. ఈ-3 సీడ్ యాక్సెస్ రహదారిని జాతీయ రహదారి-16తో అనుసంధానించే పనుల కోసం రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అనుమతి ఇచ్చింది.తెలుగువారి ఆత్మగౌరవాన్ని, వైభవాన్ని చాటిచెప్పేలా నీరుకొండ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇది కేవలం ఒక విగ్రహంగా కాకుండా, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవిత విశేషాలు, రాష్ట్ర వనరులను ప్రతిబింబించే ఒక చారిత్రక కట్టడంగా నిలవాలన్నారు. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇది తెలుగు ప్రజలందరి ప్రాజెక్టుగా, వారి భాగస్వామ్యంతోనే నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం రాజధాని పరిధిలో 85 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ భవనాలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలతో పాటు రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువు కంటే ముందే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు కూడా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM