|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:12 PM
పౌరసత్వ వివాదం కారణంగా బంగ్లాదేశ్కు పంపిన తొమ్మిది నెలల గర్భిణీ మహిళ సోనాలీ ఖాతున్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడిని తక్షణమే తిరిగి భారత్కు తీసుకొచ్చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. "మానవతా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యం కొన్నిసార్లు తలవంచాలి" అని ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణలో పాల్గొన్న సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారిని తిరిగి భారత్ తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశీయులను తిరిగి వారి స్వదేశానికి పంపించే క్రమంలో.. భారత పౌరసత్వానికి సంబంధించి సరైన పత్రాలు లేవనే కారణంతో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి చెందిన సునాలీ ఖాతున్ అనే గర్భిణీని, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు సబీర్ సహా మరో ఆరుగురుని (స్వీటీ బీబీ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు) సరిహద్దు వద్ద వదిలేశారు. బంగ్లాదేశ్ వెళ్లిపోవాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో చేసేదేమీ లేక వీరు బంగ్లాదేశ్ వెళ్లారు. అయితే ఈ ఘనపై బాధితురాలు సోనాలీ తండ్రి భోడు షేక్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె భారత పౌరురాలేనని వివరించారు. తనకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా చూపించి.. తాను భారతీయ పౌరుడేనని నిరూపించుకున్నారు.
ఈక్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. వారి బహిష్కరణను చట్ట విరుద్ధంగా పేర్కొంటూ ఆరుగురిని నెల రోజుల్లోగా వెనక్కి రప్పించాలని సెప్టెంబర్ 26వ తేదీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో.. వాటిని నిలిపివేయాలని మెహతా కోరారు. ఈక్రమంలోనే విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. బోడ్ షేక్ పౌరసత్వంపై ఎటువంటి ప్రశ్న లేనందున.. సోనాలీ అతని కుమార్తె అయితే, ఆమె, ఆమె పిల్లలు కూడా పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులే అవుతారని జస్టిస్ జోయ్ మాలా బాగ్చి అభిప్రాయపడ్డారు.
ఇలాంటి కేసుల్లో సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా మానవత్వంతో ఆలోచించి చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి సూచించింది. సునాలీ ఖాతున్, ఆమె కుమారుడిని వెంటనే భారత్కు రప్పించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోనాలీ గర్భవతి కావడంతో.. ఆమెకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే ఆమె కుమారుడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ధర్మాసనం సూచించింది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. త్వరలోనే వారిని వెనక్కి తీసుకొస్తామని చెప్పింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. సోనాలీతో పాటు అక్రమంగా పంపబడిన మిగిలిన నలుగురు వ్యక్తులను కూడా తిరిగి రప్పించే విషయమై కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే వారు బంగ్లాదేశీయులు అని, వారి పౌరసత్వంపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని మెహతా తెలిపారు. కానీ ధర్మాసనం స్పందించి.. బహిష్కరించిన మరో నలుగురిని కూడా పూర్తిగా విచారించి, వారి భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
Latest News