|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:48 PM
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని విజయవాడ రైల్వే స్టేషన్కు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్కు వెళ్లకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా (రాయనపాడు స్టేషన్ నుంచి విజయవాడ మీదుగా బల్బ్కేబిన్ పక్కనుంచి నేరుగా గుణదలకు రైళ్లు) గుణదలకు ఆరేళ్ల క్రితం కొన్ని రైళ్లను పంపారు. దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను రాయనపాడు మీదుగా మళ్లించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాయనపాడు మీదుగా రూట్ను గూడ్స్ రైళ్ల కోసం ఉపయోగించేవారు. అయితే ఎక్స్ప్రెస్ల కోసం కూడా మార్పులు చేశారు. కొంతకాలంగా రోజువారీ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా రాయనపాడు రైల్వే స్టేషన్లో ఆగుతున్నాయి.
రాయనపాడు రైల్వే స్టేషన్లో దాదాపు 14 రైళ్లను ఆపుతున్నారు. రాయనపాడు స్టేషన్ నుంచి నడిచే రైళ్ల విషయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడ స్టేషన్కు బదులుగా రాయనపాడు స్టేషన్లో రైళ్లు ఆగుతున్నాయని తెలియక ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. విశాఖ-నాందేడ్ (20811/12), కాకినాడ పోర్ట్-లింగంపల్లి గౌతమి (12737/38), నాందేడ్-సంబల్పూర్ (20809/10), కాకినాడ టౌన్-లింగంపల్లి (12775/76) రైళ్లు ఆగుతున్నాయి. వీటికి తోడు పండుగలు, సెలవుల్లో నడిచే ప్రత్యేక రైళ్లను కూడా రాయనపాడులోనే హాల్ట్ ఇచ్చారు. ఈ విషయం తెలియక ప్రయాణికులు విజయవాడ అనుకుని రాయనపాడుకు టికెట్ బుక్ చేసుకుంటున్నారు. కానీ రైలు అర్ధరాత్రి రాయనపాడులో ఆగుతుంది. అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక, ఆటోల కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోందట.
ప్రధానంగా హైదరాబాద్ నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికులు రాయనపాడు వచ్చాక ఇబ్బందిపడుతున్నారట. హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లు ఎక్కువ అర్ధరాత్రి 12.30, 1, 2 గంటలకు వస్తున్నాయట. ఆరేళ్ల క్రితం ఆర్టీసీ 24 గంటలు బస్సు సర్వీసుల్ని నడుపుతామని చెప్పినా.. ఒక్క సర్వీసు కూడా అందుబాటులో లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఏడు రైళ్లు రాజమహేంద్రవరం, వరంగల్ వైపు వెళ్లేవి ఉన్నాయట. ఆరేళ్ల క్రితం రాయనపాడు రైల్వేస్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన చేసి చాలా కాలం అయ్యింది. తాజాగా, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ను అభివృద్ధి చేశారు. ఈ పథకం ద్వారా స్టేషన్లకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే స్టేషన్కు చేరుకోవడానికి, స్టేషన్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటే బావుంటుంది అంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పిస్తే బావుంటుంది అంటున్నారు. గతంలోనే ఆర్టీసీకి లేఖలు రాసినట్లు రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. మరి ఆర్టీసీ ఈ సమస్యపై ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.