|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:23 PM
తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం దిష్టి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కామెంట్లపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పచ్చగా కొబ్బరి చెట్లతో కలకలలాడే కోనసీమకు నర దిష్టి తగిలిందంటూ.. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రస్తావన తేవటంతో.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఆడనివ్వబోమని సాక్షాత్తూ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించటం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడారా లేక.. మాంత్రికుడిలా మాట్లాడారా అంటూ విమర్శలు గుప్పించారు. "పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అన్నారా లేక క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడి హోదాలో ఆ మాటలు అన్నారా. డిప్యూటీ సీఎం అయితే గనుక.. శాస్త్రవేత్తలను పిలిపించి కొబ్బరి చెట్లకు వచ్చిన వ్యాధి గురించి పరిశోధన చేయించి.. విరుగుడుకు మందు కనుక్కుని వాటిని బతికించాలి. అలా కాకుండా మాంత్రికుడిలాగా వారి దిష్టి తగిలింది.. వీరి దిష్టి తగిలింది అనడం ఏమిటి? నిజంగా దిష్టి తగిలేటట్లు అయితే జనం సొమ్ముతో విమానాలు ఎక్కి తిరుగుతున్న మీరు ముగ్గురు ( చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్) పడిపోవాలి కానీ.. కొబ్బరి చెట్లు ఎందుకు పడిపోతాయి?. తెలంగాణ ఏపీతో పోటీపడి వరి, ఉద్యానవన పంటలు పండిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇంత టెక్నాలజీ మారిపోయిన తర్వాత కూడా పరిపాలన చేతగాక.. చేతబడులు, మంత్రాలు అని మాట్లాడటం ఏమిటి?" అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
మరోవైపు వైఎస్ జగన్ విమాన ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు పేర్ని్ నాని కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లో తిరిగేందుకు వారానికి 20 లక్షల వరకూ ఖర్చు అవుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము వాడకుండా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విమానాల్లో తిరుగుతున్నారని అంటున్నారని.. వారిని ఇన్నిసార్లు విమానాల్లో తిప్పుతోంది ఎవరో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. దమ్ముంటే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ అకౌంట్ కాపీలను బయటపెట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని ఛాలెంజ్ చేశారు. మరోవైపు అమరావతి రెండో దశ భూసమీకరణపైనా పేర్నినాని విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు అమరావతి రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు.
Latest News