|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 09:04 PM
శ్రీలంకను వణికించిన దిత్వా తుఫాను సృష్టించిన బీభత్సం కారణంగా దేశంలో ప్రాణ నష్టం భారీగా పెరిగింది. తుఫాను ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 334కి చేరినట్లు శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. మరో 370 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని.. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు దాదాపు 11.18 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపింది.
'ఆపరేషన్ సాగర్ బంధు'తో భారత్ భరోసా
విపత్కర పరిస్థితుల్లో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ.. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సాగర్ బంధు' సహాయక చర్యలు ఆదివారం కూడా ముమ్మరంగా కొనసాగాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక, రెండు చేతక్ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బందిని శ్రీలంకకు పంపారు. అంతకు ముందు రోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్ 76 విమానాలు మొత్తం 21 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.
మరోవైపు శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమాన్ని కూడా భారత్ చురుకుగా చేపట్టింది. ఆదివారం ఒక్కరోజే కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. వీరిలో 247 మంది తిరువనంతపురానికి, 76 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న 45 మంది భారతీయులను భారత వాయుసేన హెలికాప్టర్లు సురక్షితంగా కొలంబోకు చేర్చాయి. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్ హెలికాప్టర్లు తరలించి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి.
శ్రీలంకలో ఎవరైనా భారతీయులు ఇంకా చిక్కుకుని ఉంటే వెంటనే సహాయం కోసం.. అత్యవసర హెల్ప్డెస్క్ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ నంబర్కు ఫోన్ చేస్తే.. వెంటనే తాము స్పందించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు.