|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 09:00 PM
అమెరికా, వెనుజులా మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇటీవల వెనుజులా దేశ నౌకపై అమెరికా సైన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అల్టమేటం ఇచ్చారు. ఇటీవల మదురోతో ఫోన్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ‘నీతో పాటు నీ సన్నిహితులను కాపాడుకో.. కానీ, తప్పనిసరిగా వెనుజులా వీడి వెళ్లిపో’ అని ట్రంప్ హెచ్చరించినట్టు మియామీ హెరాల్డ్ అనే అంతర్జాతీయ పత్రిక నివేదించింది. ఒకవేళ అంగీకరిస్తే మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరేస్, వారి కుమారుడు, ఇతర కీలక నేతలు సురక్షితంగా దేశం దాటేందుకు సహకరిస్తామని అమెరికా పదేపదే ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ షరతులకు వెనుజులా నిరాకరించడంతో చర్చలు విఫలమయ్యాయి.
కాగా, తాను నికోలస్ మాదురోతో ఇటీవల ఫోన్లో మాట్లాడిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ధ్రువీకరించారు. కానీ, వివరాలను వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించాడు. ‘మా సంభాషణ బాగా జరిగిందా? లేదా? అనేది నేను’ చెప్పను అని ట్రంప్ అన్నారు. వెనిజులా గగనతలాన్ని ‘పూర్తిగా మూసివేయాలని’ బహిరంగంగా హెచ్చరించిన తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడారు. చర్చలు విఫలమై, సైనిక సంపత్తిని వెనుజులాకు పంపడంతో ఉద్రిక్తతల మరింత పెరుగుతున్న నడుమ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని తమ దేశానికి చెందిన ప్రతిపక్ష నేత మారియా కోరినాకు ఇవ్వడంపై వెనుజులా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నవంబరు 16తో ముగి మదురో, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు మియామీ హెరాల్డ్ పేర్కొంది. ఈ సమయంలో తనకు రెండు హామీలు ఇవ్వాలని ట్రంప్ను మదురో కోరడంతో చర్చలు నిలిచిపోయినట్టు తెలిపింది. తనకూ, తన సన్నిహిత వర్గంలోని సీనియర్లకు గ్లోబల్ అమ్నెస్టీ ఇవ్వాలని, అలాగే స్వేచ్ఛాయుత ఎన్నికలకు అనుమతించినా కూడా వెనిజులా సాయుధ దళాలపై తన అధికారం కొనసాగాలని ఆయన కోరాడు. అయితే, ఈ రెండు హామీలను తోసిపుచ్చిన ట్రంప్.. తక్షణమే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ట్రంప్తో మాట్లాడేందుకు మదురో ప్రభుత్వం ప్రయత్నించినా.. ఇటువైపు నుంచి స్పందన రాలేదని చెప్పింది.
కాగా, మదురో, అతడి యంత్రాంగంలోని కీలక వ్యక్తులు అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నారని వెనుజులా సైన్యంతో అనుబంధం, ప్రభుత్వ డ్రగ్స్ నెట్వర్క్లపై అవగాహన ఓ రక్షణ నిపుణుడు హెచ్చరించారు. చర్చలు విఫలమైన తరువాత వెనిజులాపై ఒత్తిడి పెంచిన ట్రంప్.. త్వరలోనే సైనిక చర్య కూడా ప్రారంభమవుతుందని హెచ్చరించాడు. వెనిజులా గగనతలం మీదుగా విమాన సర్వీసులను నడపొద్దని ఆదేశించాడు. దీంతో వెనుజులా గగనతలం మీదుగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి. దీనికి ప్రతిస్పందనగా వెనిజులా పలు విదేశీ విమానయాన సంస్థల నిర్వహణ హక్కులను రద్దు చేసింది. దీనిని వలసదారులపై అమెరికా దాడిగా ఆరోపించింది.
Latest News