|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 08:59 PM
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల పాటు జరిగే దర్శనాల కోసం 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన 1.80 లక్షల టోకెన్లకు గాను, ఏకంగా 24,05,237 మంది భక్తులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇది వైకుంఠ ద్వార దర్శనంపై భక్తులకు ఉన్న అపారమైన భక్తివిశ్వాసాలకు నిదర్శనంగా నిలుస్తోంది.అత్యంత కీలకమైన వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 ద్వాదశి డిసెంబర్ 31 నూతన సంవత్సరం జనవరి 1 రోజులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులకు గాను 9.6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో భక్తులకు కేటాయించనున్నారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, వెబ్సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవ ద్వారా 1.5 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇక మిగిలిన ఏడు రోజులకు సంబంధించిన సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఈ తేదీలకు గాను రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను, వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను డిసెంబర్ 5న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. స్థానికుల కోసం జనవరి 6, 7, 8 తేదీలకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లను డిసెంబర్ 10న అందుబాటులో ఉంచుతారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
Latest News