ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మళ్లీ విధుల్లోకి,,,,డీజీపీ ఉత్తర్వులు
 

by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:43 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ మళ్లీ విధుల్లోకి చేరారు. ప్రకాష్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీజీపీ ఆఫీసు నుంచి ఆర్డర్స్ తీసుకున్న ఆయన.. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ను కలిశారు. తిరిగి విధుల్లోకి చేరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నతాధికారులను ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్ ప్రకాష్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. పోలీస్ సిబ్బందికి రావాల్సిన బకాయిలను డిమాండ్ చేస్తూ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ అప్పట్లో ధర్నా చేశారు. దీంతో అతన్ని క్రమశిక్షణ రాహిత్యం కింద పోలీస్ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకాష్‌ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ సారి శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి పర్యటనకు వచ్చారు. అయితే జగన్ పర్యటన సమయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉన్న ప్రకాష్.. అనంతపురంలో ఆమరణ దీక్ష చేశారు. 70 వేల మంది పోలీసులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించండి సీఎం సార్ ప్లీజ్ అంటూ ప్రకాష్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతర కాలంలో వివిధ ఆరోపణలు రావటంతో.. ప్రకాష్‌ను క్రమశిక్షణారాహిత్యం కింద విధుల నుంచి తప్పించారు. ఇన్నిరోజులుకి తిరిగి మళ్లీ ఆయన తన ఉద్యోగంలో చేరారు.


అయితే ఉద్యోగం కోల్పోయిన తర్వాత ప్రకాష్ పలుసార్లు వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారులు తనపై కుట్ర చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. చట్టవిరుద్ధంగా తనను విధుల నుంచి తొలగించారని.. తప్పుడు స్టేట్‌మెంట్లు ఆధారంగా తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులకు రావాల్సిన బకాయిలు అడిగినందుకే విధుల నుంచి తొలగించారంటూ ఆరోపించడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే ప్రకాష్ మీద ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అప్పట్లో ఎస్పీ ఫక్కీరప్ప విలేకర్లకు వెల్లడించారు. వాటిపై శాఖపరమైన విచారణ జరుగుతోందని.. రెండు కేసుల్లో అభియోగాలు కూడా రుజువయ్యాయని.. అందుకే చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని అప్పట్లో ఆయన వెల్లడించారు. అయితే ఇన్ని రోజులకు మళ్లీ విధుల్లో చేరడం ద్వారా కానిస్టేబుల్ ప్రకాష్ మరోసారి వార్తల్లో నిలిచారు.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM