|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 05:23 AM
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తమ స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్లో ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో, నమ్మకమైన ఇంటర్నెట్ సేవలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు నెట్ కనెక్టివిటీ అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ఇన్వెస్టర్ నిఖిల్ కామత్తో 'పీపుల్ ఆఫ్ డబ్ల్యూటీఎఫ్' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్లింక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో తన సేవలను అందిస్తోంది.భూమికి దగ్గరగా, సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని మస్క్ వివరించారు. ఈ ఉపగ్రహాల మధ్య లేజర్ లింకులు ఉంటాయని, దీనివల్ల భూమిపై ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగదని చెప్పారు. సాధారణంగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోస్టేషనరీ శాటిలైట్లతో పోలిస్తే, స్టార్లింక్ ఉపగ్రహాలు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయని ఆయన తెలిపారు.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్టార్లింక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మస్క్ అన్నారు. వరదలు, భూకంపాలు వంటి సమయాల్లో భూమిపై ఉన్న నెట్వర్క్ వ్యవస్థలు దెబ్బతిన్నా, స్టార్లింక్ శాటిలైట్లు పనిచేస్తూనే ఉంటాయని తెలిపారు. అంతేకాదు, విపత్తుల సమయంలో ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల రెడ్ సీ కేబుల్స్ తెగిపోయినప్పుడు కూడా స్టార్లింక్ సేవలు నిరంతరాయంగా కొనసాగాయని గుర్తుచేశారు.స్టార్లింక్ ఇప్పటికే ఉన్న టెలికాం కంపెనీలకు పోటీ కాదని మస్క్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ కేబుల్స్ వేయడం, సెల్ టవర్లు నిర్మించడం ఖర్చుతో కూడుకున్నదని, అలాంటి చోట్ల తమ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అయితే, జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో స్టార్లింక్ సమర్థంగా పనిచేయలేదని, అక్కడి స్థానిక నెట్వర్క్లతో పోటీ పడటం భౌతికంగా సాధ్యం కాదని వివరించారు.
Latest News