|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:28 PM
అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పెళ్లి విషయంలో.. తల్లిదండ్రులు, అయినవాళ్లు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ కులం కాకుండా ఇతరులను ఇష్టపడిందని, తమ తాహతుకు తగిన వారు కాదని.. వివిధ కారణాల వల్ల పరువు, ప్రతిష్టల పేరిట దారుణమైన హత్యలకు తెగబడుతున్నారు. ఇలాగే తన కుటుంబం సభ్యుల చేతిలో హతమైన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన అక్కడున్న వారందరినీ షాక్కు గురిచేసింది. నుదుట సిందూరం ధరించి, చనిపోయినా అతడే తన భర్త అంటూ గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టిన యువతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ హృదయ విదారక ఘటన మాహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నాందేడ్కు చెందిన సాక్షమ్ టేట్ (25), హిమేష్ మమిదార్ స్నేహితులు. ఈ క్రమంలో హిమేష్ సోదరి అంచల్, సాక్షమ్కు పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకుందామని కలలు కన్నారు. ఇంతలోనే ఈ విషయం అంచల్ కుటుంబ సభ్యులకు తెలిసింది. సాక్షమ్ కులం వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో అంచల్ కుటుంబ సభ్యులు.. సాక్షమ్పై కక్ష పెంచుకున్నారు. అతడిని ఎలాగైనా చంపాలని ప్రణాళికలు రచించారు. అనుకున్నదే తడవుగా పక్కా ప్లాన్ వేసి.. నవంబర్ 27న జునా గంజ్ ప్రాంతంలో సాక్షమ్ను కిరాతకంగా హత్య చేశారు.
ఈ విషయం తెలుసుకున్న అంచల్.. ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. చనిపోయినా అతడే తన భర్త అంటూ.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఈ దృష్యం అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. తన తండ్రి, సోదరులు చేసిన పనికి.. తాను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి అంచల్ శిక్ష అనుభవిస్తోంది. ఈ క్రమంలో తన తండ్రి సోదరులను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. తమ ప్రేమ శాశ్వతమని.. అతడు లేకున్నా తాను తన ప్రియుడి ఇంట్లోనే ఉంటానని చెప్పింది అంచల్.
మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఇత్వారా పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్టు చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ షిండే తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, హత్యకు రెండు గంటల ముందు.. యువతి తల్లి యువకుడి ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించినట్లు సమాచారం.
Latest News