|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 05:30 PM
సీపీఐ అగ్రనేత కె.నారాయణ 'ఐబొమ్మ' వెబ్సైట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని, అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. తాను కూడా ఐబొమ్మలో ఉచితంగా సినిమాలు చూశానని ఈ సందర్భంగా నారాయణ వెల్లడించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.టికెట్ ధరలను రూ.600-700కు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు.కోట్లు ఖర్చుపెట్టి, టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుందాకోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బకొట్టారు అని నారాయణ వ్యాఖ్యానించారు. ఒకరిని జైల్లో వేయడం వల్ల ప్రయోజనం లేదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని సూచించారు.వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత కాలం ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు. "ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారు. అదే విధంగా, మావోయిస్టు నేత హిడ్మాను చంపడం ద్వారా వెయ్యి మంది హిడ్మాలు పుడతారు" అని అన్నారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే రవి లాంటి వారు తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.వ్యక్తులను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య వ్యవస్థలోనే ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టిస్తోందని, లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి వారు వస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Latest News