|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:39 PM
2027 కుంభమేళా కోసం మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 3,700 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సాధువులు, సంతుల బస కోసం తపోవన్ ప్రాంతంలో ‘సాధుగ్రామ్’ నిర్మించనున్నారు. దీని కోసమే పాత, దృఢమైన దేశీయ వృక్షాలను తొలగించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ పనులను ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాకు దీటుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శుక్రవారం నటుడు సాయాజీ షిండే స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి, నిరసనకారులకు తన మద్దతు తెలిపారు. ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మొక్కలు నాటిన సాయాజీ షిండే, ప్రభుత్వ మొక్కల పెంపకం కార్యక్రమాలను గతంలోనూ ప్రశ్నించారు. చెట్లను నరికేస్తున్న ప్రాంతానికి ‘తపోవనం’ అని పేరు ఉండటం గమనార్హం. ఇలాంటి పవిత్ర ప్రదేశంలోనే చెట్లను కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వివాదంలో నగరపాలక సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధుగ్రామ్ నిర్మించ తలపెట్టిన ప్రాంతం ‘నో-డెవలప్మెంట్ జోన్’ పరిధిలోకి వస్తుందని, అభివృద్ధి ప్రణాళికలో మార్పులు చేయకుండానే పనులు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, నరకడానికి గుర్తించిన చెట్లలో కొన్నింటిని గతంలో నగరపాలక సంస్థే నాటినట్లు నిరసనకారులు ఆధారాలతో సహా బయటపెట్టారు.
Latest News