|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:44 PM
కాంగ్రెస్ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. ఆయన ప్రస్తుతం లండన్లో ఉన్నారని, తన మేనకోడలి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. అయితే, రాహుల్ గాంధీ తరచూ విదేశాలకు వెళ్లడంపై, ఆ వివరాలు గోప్యంగా ఉంచడంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ పరిణామంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల తీరును తప్పుబడుతూ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. "రాహుల్ గాంధీ గత వారమే ఓ రహస్య విదేశీ పర్యటన ముగించుకువచ్చారు. ఇప్పుడు మళ్లీ మరో అజ్ఞాత ప్రదేశానికి విదేశాలకు వెళ్లారు" అని మాలవీయ తన పోస్ట్లో ఆరోపించారు. "ఈ తరచూ అదృశ్యమవ్వడాలు ఎందుకు? దేశానికి దూరంగా ఆయనను అంతగా ఆకర్షిస్తున్న విషయం ఏమిటి? లోక్సభలో ప్రతిపక్ష నేతగా, భారత ప్రజలకు ఆయన ఈ విషయాలపై సమాధానం చెప్పి తీరాలి" అని అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.
Latest News