|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 04:49 PM
ఆపరేషన్ సిందూర్'లో భారత సాయుధ బలగాల అసమాన ధైర్యసాహసాలను ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కొనియాడారు. మంగళవారం జరిగిన అదానీ గ్రూప్ 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ ద్వారా భారత బలగాలు దేశానికి శాంతి ఎంత విలువైందో చాటిచెప్పాయని అన్నారు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ మాట్లాడుతూ, "మన బలగాలు ఆపరేషన్ సిందూర్లో అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించాయి. వారు పేరుప్రతిష్ఠలు లేదా పతకాల కోసం కాకుండా, కేవలం తమ విధి నిర్వహణలో భాగంగానే ఈ సాహస కార్యాన్ని చేపట్టారు.శాంతి అనేది ఉచితంగా లభించదని, దాన్ని సంపాదించుకోవాలని వారి త్యాగం మనకు గుర్తుచేసింది. శాంతి విలువ ఏమిటో భారతదేశానికి బాగా తెలుసు. అలాగని, ఎవరైనా మన దేశానికి హాని తలపెట్టాలని చూస్తే, వారికి అర్థమయ్యే రీతిలో ఎలా స్పందించాలో కూడా మనకు తెలుసు" అని స్పష్టం చేశారు.ఈ ఆపరేషన్లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కు చెందిన డ్రోన్లు కూడా పాలుపంచుకున్నాయని, అవి విజయవంతంగా తమ లక్ష్యాలను పూర్తి చేశాయని గౌతమ్ అదానీ వెల్లడించారు. తమ గ్రూప్ అభివృద్ధి చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థలు మన సైనికులను, పౌరులను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. దేశ రక్షణలో తమ వంతు సహకారం అందించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు
Latest News