|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:06 PM
ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ .. భారత జట్టు తరఫున డెబ్యూ చేశాడు. ఇంగ్లాండ్తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అతడు భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా.. సుదర్శన్కు టెస్టు క్యాప్ అందించాడు. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 317వ ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు.
అయితే సాయి సుదర్శన్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఓ విషయంపై చర్చ జరుగుతోంది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ , విరాట్ కోహ్లీలు సైతం సాయి సుదర్శన్ డెబ్యూ చేసిన రోజే.. అంటే జూన్ 20వ తేదీనే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. వారంతా టీమిండియా తరఫున 100కు పైగా టెస్టు మ్యాచులు ఆడారు. భారత్ తరఫున రాహుల్ ద్రవిడ్ 164, గంగూలీ 113, విరాట్ కోహ్లీ 123 టెస్టు మ్యాచులు ఆడారు. దీంతో సాయి సుదర్శన్ కూడా భారత్ తరఫున వందకు పైగా టెస్టు మ్యాచులు ఆడతాడని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం.
కాగా 23 ఏళ్ల సాయి సుదర్శన్.. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 49 ఇన్నింగ్స్లలో 1957 పరుగులు స్కోరు చేశాడు. సుమారు 40 సగటుతో సాయి ఈ రన్స్ సాధించాడు. ఇక ఐపీఎల్ 2025లో అతడు అదరగొట్టాడు. 15 మ్యాచులలో సుమారు 55 సగటుతో 759 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.
Latest News