|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:58 PM
డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ 100 మందికి పైగా సంతానం ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా తనకు ముగ్గురు ప్రియురాళ్లు ఉండగా.. వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారని, అలాగే తాను వీర్యదానం చేయడం వల్ల పుట్టిన మరో 100 మంది పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే తన 20 బిలియన్ డాలర్ల సంపదను.. సొంత పిల్లలతో పాటు బయోలాజికల్ సంతానానినికి కూడా పంచేస్తానంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వీలునామా కూడా రాసినట్లు చెప్పారు. ఈ అసాధారణ నిర్ణయం టెక్ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పావెల్ దురోవ్ తన 40వ ఏటనే వీలునామా రాయడానికి గల కారణాలను కూడా వివరించారు. స్వేచ్ఛలను పరిరక్షించే తన పనిలో ప్రమాదాలు ఉన్నాయని, శక్తివంతమైన దేశాలతో సహా చాలా మంది శత్రువులు తనకు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను రక్షించుకోవడానికి, టెలిగ్రామ్ తన విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన తర్వాత టెలిగ్రామ్ను ఒక లాభాపేక్ష లేని సంస్థ (నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్) అని, అది గోప్యత మరియు భావప్రకటనా స్వేచ్ఛ వంటి తన విలువలను కొనసాగిస్తుందని దురోవ్ స్పష్టం చేశారు.
దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడికి సహాయం చేయడానికి దురోవ్ స్పెర్మ్ డొనేషన్ చేయడం ప్రారంభించారు. దీని ఫలితంగా 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలు జన్మించారు. ఇక తనకు మొత్తంగా ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉండగా.. వారందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. ఇలా ఆరుగురు సంతానం సొంత పిల్లలు కాగా, 100 మందికి బయోలాజికల్ తండ్రి అయ్యారు. ఈక్రమంలోనే తన సొంత పిల్లలతో పాటు స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించిన పిల్లలు అందరినీ సమానంగా చూస్తానని దురోవ్ నొక్కి చెప్పారు. తన మరణానంతరం వారందరూ ఐక్యంగా ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
దురోవ్ తన వీలునామాలో మరో ముఖ్యమైన షరతు కూడా పెట్టారు. తన పిల్లలకు 30 సంవత్సరాల పాటు తన సంపద అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. వారు స్వతంత్రంగా జీవించాలని, సొంత మార్గాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా తన పిల్లలు కష్టపడి తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. టెక్ ప్రపంచంలో ఒక విజేతగా, అలాగే వ్యక్తిగత జీవితంలో ఒక వినూత్న ఆలోచనాపరుడిగా పావెల్ దురోవ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Latest News