|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 06:33 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో.. ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని చీలి సింగయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పలు వివరాలు వెల్లడించారు. చీలి సింగయ్యది.. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంగా ఎస్పీ తెలిపారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి.. జగన్ను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు సింగయ్య వచ్చారని సతీష్ కుమార్ వివరించారు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చిందని.. అయితే కాన్వాయి ముందు ఉన్న ప్రైవేటు వాహనం చీలి సింగయ్యను ఢీకొట్టిందన్నారు.
సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. దీంతో గాయపడిన సింగయ్యను అక్కడ ఉన్నవారు గమనించి రోడ్డు పక్కన ఉన్న డివైడర్పై పడుకోబెట్టినట్లు గుంటూరు ఎస్పీ వివరించారు. అనంతరం హైవే పోలీసులు సింగయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సింగయ్య చనిపోయారని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సింగయ్య మృతిపై అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు వైఎస్ జగన్ కాన్వాయితో పాటుగా మరో మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇచ్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అయితే ఎక్కువ వాహనాలు రావటంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. వైఎస్ జగన్ కాన్వాయ్కు కేవలం మూడు వాహనాలకే అనుమతి ఇస్తే.. కాన్వాయితో పాటు మరో 30 నుంచి 40 వాహనాలు ర్యాలీగా వచ్చాయని గుంటూరు ఎస్పీ వెల్లడించారు.
మరోవైపు.. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలోనూ విషాదం చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త చనిపోయినట్లు తెలిసింది. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. జయవర్దన్ రెడ్డి సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నడుపుతున్నట్లు తెలిసింది.
వైఎస్ జగన్ రావటంతో సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సమయంలోనే ఊపిరాడక జయవర్ధన్ చనిపోయినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు.
Latest News